సామాజిక స్థలంలో అక్రమ నిర్మాణాలు
– దీప్తిశ్రీనగర్లో కాలనీవాసుల ఆగ్రహం
– విజిలెన్స్ విచారణకు డిమాండ్
– న్యాయపోరాటానికి సిద్ధమంటున్న అసోసియేషన్
శేరిలింగంపల్లి-విశాల భారతి
సామాజిక అవసరాల కోసం కేటాయించిన కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ అనుమతులు మంజూరు చేయడంపై దీప్తిశ్రీనగర్ కాలనీలో తీవ్ర ఉద్రిక్తత, వివాదం నెలకొంది. టౌన్ప్లానింగ్ ఉన్నతాధికారులు నిబంధనలను తుంగలో తొక్కి, ప్రైవేటు శక్తులకు కొమ్ముకాస్తున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లేఔట్ నిబంధనల ఉల్లంఘన…
హుడా గతంలో ఆమోదించిన అధికారిక లేఔట్ ప్రకారం.. దీప్తిశ్రీనగర్ పరిధిలోని సర్వే నంబర్లు 119, 120, 125, 128, 137, 138/2, 139, 140, 150లలో ఉన్న 5,270 గజాల భారీ భూభాగాన్ని పాఠశాల, పార్కు మరియు ఇతర సామాజిక అవసరాల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. రెవెన్యూ రికార్డుల్లోనూ ఈ స్థలం స్పష్టంగా సామాజిక అవసరాల స్థలంగానే నమోదై ఉంది.అయితే, కాలనీవాసుల కళ్లు గప్పి ఈ విలువైన భూమి వివిధ దశల్లో అక్రమంగా ప్రైవేటు సంస్థల చేతులు మారింది. అంతటితో ఆగకుండా, సదరు స్థలంలో వాణిజ్య లేదా నివాస నిర్మాణాలకు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం చకచకా అనుమతులు జారీ చేయడం గమనార్హం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కమ్యూనిటీ స్థలాలను వేరే అవసరాలకు బదిలీ చేయడానికి వీల్లేకపోయినా, అధికారులు ఏ ప్రాతిపదికన పర్మిషన్లు ఇచ్చారని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై నిరసనలు
ఈ అక్రమ అనుమతులపై దీప్తిశ్రీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీవాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్థల పరిరక్షణ కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారుల విచారణే శరణ్యం..
“కోట్ల రూపాయల విలువైన ప్రజా ఆస్తిని కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి, ప్రైవేటు బిల్డర్లకు అధికారులు ఎలా సహకరిస్తారు? ఈ వ్యవహారంపై తక్షణమే విజిలెన్స్ విచారణ జరిపించాలి. అవినీతికి పాల్పడిన అధికారులపై, నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అధికారులు స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తాం.”
— వై. సీతారామయ్య, ప్రెసిడెంట్, దీప్తిశ్రీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్.
ఆందోళనల బాటలో కాలనీవాసులు
భవిష్యత్తు తరాల కోసం, పిల్లల ఆటస్థలాలు, పాఠశాలల కోసం కేటాయించిన భూమిని కాపాడుకునేందుకు కాలనీ మహిళలు, సీనియర్ సిటిజన్లు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈ వివాదంపై మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే సదరు నిర్మాణ అనుమతులను రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు.
