కొండాపూర్ లో విదేశీ యువతిపై అసభ్య ప్రవర్తన
– నెదర్లాండ్స్ యువతి ఫిర్యాదుతో సాఫ్ట్వేర్ ఉద్యోగిపై కేసు నమోదు
సైబరాబాద్ – విశాల భారతి
కొండాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న నెదర్లాండ్స్ దేశానికి చెందిన యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.బాయ్ ఫ్రెండ్ ను కలిసేందుకు మార్చి నెలలో నెదర్లాండ్స్ నుండి హైదరాబాద్ కు వచ్చిన ఆ యువతి కొండాపూర్ లోని ఒక ఫ్లాట్ లో బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉంటోంది. అదే ఇంట్లో ఆదిత్య ఆనంద్ అనే మరో యువకుడు కూడా నివాసం ఉంటున్నాడు. బాయ్ ఫ్రెండ్ ఇంట్లో లేని సమయాలను చూసి ఆదిత్య ఆనంద్ తరచూ తనపై అసభ్యంగా ప్రవర్తించేవాడని, మాటలతో, చేష్టలతో వేధించేవాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది.అతని ప్రవర్తనతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన యువతి కొంతకాలం క్రితం ఇండియా నుండి తన స్వదేశానికి తిరిగి వెళ్లింది. అక్కడ భారత ఎంబసీని కలిసి జరిగిన విషయాన్ని వివరించి న్యాయం చేయాలని కోరింది. ఎంబసీ అధికారులు ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకురావడంతో యువతి మూడు రోజుల క్రితం తిరిగి హైదరాబాద్ కు వచ్చింది.ఆదివారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన యువతి ఘటన వివరాలను పోలీసులకు పూసగుచ్చినట్లు తెలిపింది. తన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడు ఆదిత్య ఆనంద్ పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కాల్ డేటా, ఇంట్లోని సిసి కెమెరా ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని, త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తామని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. బాధితురాలి వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనతో కొండాపూర్ ప్రాంతంలోని విదేశీ విద్యార్థులు, ఉద్యోగులు నివసించే కాలనీల్లో భద్రతపై చర్చ జరుగుతోంది.
