హైదరాబాద్లో జాతీయ జెండాకు అవమానం
– నాగోల్ మూసీ తీరంలో నిర్లక్ష్యం వెలుగులోకి
హైదరాబాద్ – విశాల భారతి
నగరంలోని నాగోల్ మూసీ రివర్ఫ్రంట్ ప్రాంతంలో జాతీయ జెండా నేలపై పడివుండడం స్థానికుల్లో ఆగ్రహానికి దారితీసింది. నిర్వహణా లోపాల కారణంగా జెండా స్తంభానికి అమర్చిన ఇనుప గొలుసులు (రోప్స్) తెగిపోవడంతో జాతీయ జెండా చిరిగి నేలపై పడిపోయినట్లు స్థానికులు తెలిపారు.జాతీయ జెండా కిందపడిన విషయం తెలిసినా సంబంధిత మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించలేదని, మరమ్మత్తులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జాతీయ జెండా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ అలాంటి అంశంలో అలసత్వం ప్రదర్శించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, జాతీయ జెండాను నిబంధనలకు అనుగుణంగా మళ్లీ ఎగురవేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి పరిస్థితిని సరిదిద్దాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
