ఆన్లైన్ మోసాలపై జీడిమెట్ల పోలీసుల అవగాహన
– ఉద్యోగులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన అధికారులు
సైబరాబాద్ – విశాల భారతి: ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీడిమెట్ల పోలీసులు సూచించారు. ‘సురక్ష కా తిరంగా’ ప్రచారంలో భాగంగా మంగళవారం టీఎస్ఐసీ కాలనీలోని ఈక్యూఐసీ కంపెనీలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.జీడిమెట్ల ఇన్స్పెక్టర్ రవికుమార్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో డీఐ ధనుంజయ, ఎస్ఐ ప్రేమ్సాగర్, కానిస్టేబుళ్లు నరేష్, సుబ్బారెడ్డి, మహిళా కానిస్టేబుల్ నాజియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు ఆన్లైన్ ఆర్థిక మోసాలు, సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే నేరాలపై వివరించారు.ఓటీపీ, పిన్ నంబర్లు, పాస్వర్డ్లు, బ్యాంకు ఖాతా వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ఆకర్షణీయమైన ఆఫర్లు, నకిలీ లింకులు, ఇతరుల పేరుతో వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. మోసపోయిన నగదును తిరిగి పొందేందుకు చేపట్టే చర్యలు, ఫిర్యాదు పరిష్కార విధానంపై కూడా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కంపెనీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
