రేగుల కుంట భూమిని కాపాడాలి
– జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి డిమాండ్
– చర్యలు తీసుకుంటామన్న తహసీల్దార్
సైబరాబాద్ – విశాల భారతి
హఫీజ్ పేట్ సర్వే నంబర్ 151లోని రేగుల కుంట ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి కాపాడి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ‘జనం కోసం’ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి డిమాండ్ చేశారు. సదరు భూమి ప్రభుత్వానిదేనని తహసీల్దార్, ఆర్డీవో, ఏడీ నివేదికల్లో తేలినప్పటికీ అక్కడ ఇంకా నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయని శేరిలింగంపల్లి తహసీల్దార్ మహిపాల్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. అధికారులు మౌనంగా ఉండటం సరికాదని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై స్పందించిన తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. అక్కడ జరుగుతున్న నిర్మాణాలకు ఇచ్చిన జీహెచ్ఎంసీ అనుమతులను రద్దు చేయాలని లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత డిప్యూటీ తహసీల్దార్ ను ఆదేశించారు.
