జిమ్లో గాయపడిన కేటీఆర్ తనయుడు
– హిమాన్షును పరామర్శించేందుకు ఏఐజీకి కేసీఆర్
సైబరాబాద్ – విశాల భారతి
జిమ్లో వర్కవుట్స్ చేస్తూ గాయపడి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మనవడు కల్వకుంట్ల హిమాన్షురావును పరామర్శించేందుకు భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్హౌస్ నుంచి హుటాహుటిన బయలుదేరారు. మాజీ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు ఉన్నత చదువుల కోసం అమెరికాలో ఉండగా, ఇటీవలే భారత్కు వచ్చారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి కొద్దిరోజులుగా హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం జిమ్లో వర్కవుట్ చేస్తుండగా ముక్కుకు గాయమై రక్తస్రావమైంది. వెంటనే కుటుంబసభ్యులు ఆయనను ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.విషయం తెలియగానే కేటీఆర్ దంపతులు ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి హరీశ్రావు సైతం ఆస్పత్రికి వెళ్లి హిమాన్షు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముద్దుల మనవడు గాయపడ్డాడని తెలియగానే కేసీఆర్ తీవ్ర ఆందోళనకు గురై ఎర్రవల్లి ఫామ్హౌస్ నుంచి హైదరాబాద్కు బయలుదేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరికొద్దిసేపట్లో ఆయన ఆస్పత్రికి చేరుకుని హిమాన్షును పరామర్శించనున్నారు.హిమాన్షు ఆరోగ్యంపై భారాస నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలువురు కీలక నేతలు ఏఐజీ ఆస్పత్రికి చేరుకుంటున్నారు. అయితే హిమాన్షుకు తగిలింది చిన్న గాయమేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మాజీ సీఎం రాకతో ఆస్పత్రి వద్ద భద్రతను పెంచారు.
