ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై మహాధర్నా
– విద్యార్థుల భవిష్యత్తో చెలగాటం వద్దు
– ఇచ్చిన హామీలను అమలు చేయాలి
– వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్
శేరిలింగంపల్లి – విశాల భారతి
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సోమవారం మహాధర్నా, ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రక్షణ సేన శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జి వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో మదీనాగూడ గాంధీ సర్కిల్ నుంచి చందానగర్ ఓల్డ్ గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు రూ.5 లక్షల ప్రమాద బీమా, స్కూటీల పంపిణీ వంటి హామీలను నెరవేర్చాలని అన్నారు.ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో కుమార్, దయానంద్ ముదిరాజ్, సందీప్ డిసోజు, విష్ణు, రఘు, పవన్తో పాటు విద్యార్థులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
