గచ్చిబౌలిలో కూలిన భవనం వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు
– భారీ వర్షంతో శిథిలాల తొలగింపునకు ఆటంకం
– ప్రమాదకరంగా మారిన జయదర్శి అపార్ట్మెంట్ కూల్చివేతకు ఏర్పాట్లు
సైబరాబాద్ – విశాల భారతి
గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటన ప్రాంతంలో సహాయక, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా శిథిలాల తొలగింపు పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వర్షపు నీరు చేరడంతో సహాయక బృందాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. శిథిలాలను తొలగిస్తూ లోపల ఎవరైనా చిక్కుకుపోయారా అనే కోణంలో అధికారులు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు.
గచ్చిబౌలి పరిధిలో 40 గజాల స్థలంలో అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన ఏడంతస్తుల భవనం శుక్రవారం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. భారీ నిర్మాణ శిథిలాలు ఉండటంతో వాటిని తొలగించడం సవాలుగా మారింది. వర్షం కారణంగా పనులు మరింత నెమ్మదించాయి.
నిర్మాణదారుడి కోసం గాలింపు
భవన నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్రమంగా భవన నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాజిద్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. భవన నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులు ఎలా నిర్మించారు? నిర్మాణ సమయంలో సంబంధిత అధికారులు ఎలాంటి తనిఖీలు చేపట్టారు? అనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు.
జయదర్శి అపార్ట్మెంట్ కూల్చివేతకు సన్నాహాలు
మరోవైపు ప్రమాదకర స్థితిలో ఉన్న జయదర్శి అపార్ట్మెంట్పై అధికారులు దృష్టి సారించారు. భవనం పరిస్థితిని పరిశీలించిన అధికారులు దానిని కూల్చివేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. భవనం ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కూల్చివేతకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కూల్చివేత సమయంలో చుట్టుపక్కల ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా భద్రతా చర్యలు చేపట్టనున్నారు. అవసరమైతే పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించి, రాకపోకలను నియంత్రించే అవకాశం ఉంది. కూల్చివేతకు అవసరమైన యంత్రాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు.
అక్రమ నిర్మాణాలపై నజర్
గచ్చిబౌలి ఘటన నేపథ్యంలో అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై అధికార యంత్రాంగం మరింత దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రమాదకరంగా ఉన్న నిర్మాణాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు కూలిన భవనానికి సంబంధించిన నిర్మాణ అనుమతులు, నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
