వాహన తనిఖీల్లో దొంగ బైక్ పట్టివేత
– హఫీజ్పేట్ ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ పోలీసుల అప్రమత్తత
– చోరీ కేసులో నిందితుడు బాచుపల్లి పోలీసులకు అప్పగింత
సైబారాబాద్ – విశాల భారతి
ట్రాఫిక్ తనిఖీల్లో గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు చోరీకి గురైన మోటార్సైకిల్ను గుర్తించి నిందితుడిని పట్టుకున్నారు. సోమవారం ఉదయం హఫీజ్పేట్ లేబర్ అడ్డా సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ ఆర్ ఐ జి.లవ కుమార్ రెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్, హోంగార్డు సిబ్బంది కలిసి సాధారణ వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా అటుగా వెళ్తున్న హోండా డీలక్స్ మోటార్సైకిల్ను అనుమానంతో నిలిపి వాహన పత్రాలు, ఇంజిన్, ఛాసిస్ వివరాలను పరిశీలించారు. అనంతరం పోలీసుల రికార్డులతో సరిపోల్చగా, ఆ వాహనం బాచుపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్ 933/2025 చోరీ కేసుకు సంబంధించినదిగా నిర్ధారణ అయింది. ఈ కేసు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 303(2) కింద నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
వెంటనే మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు, దానితో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని బాచుపల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ బృందానికి అప్పగించారు. ఘటనపై బాచుపల్లి పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.ట్రాఫిక్ పోలీసులు కేవలం ట్రాఫిక్ నిబంధనల అమలుకే పరిమితం కాకుండా, చోరీ వాహనాలను గుర్తించడం, నేరస్తులను పట్టుకోవడం, ఇతర పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను ఛేదించడంలోనూ సమర్థంగా పనిచేస్తున్నారని ఈ ఘటన మరోసారి నిరూపించిందని అధికారులు తెలిపారు. ప్రతి వాహన తనిఖీ ప్రజల భద్రతతో పాటు నేరాల నియంత్రణలోనూ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
